బెంగాల్ పోరు: మమత ‘సర్జికల్ స్ట్రైక్’.. 74 మంది సిట్టింగ్‌లకు షాక్!

  • పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
  • భవానీపూర్ నుంచి బరిలోకి దిగుతున్న దీదీ
  • జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లిం అభ్యర్థులకు చోటు
  • టికెట్లు దక్కని నేతల నుంచి అసమ్మతి, బీజేపీ వైపు చూపు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ శంఖారావం పూరించారు. ఈసారి అభ్యర్థుల ఎంపికలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీపై ఉన్న వ్యతిరేకతను అధిగమించే లక్ష్యంతో, ఏకంగా 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేని వారిని పక్కనపెట్టి, ‘క్లీన్ ఇమేజ్’ ఉన్న కొత్త ముఖాలకు ప్రాధాన్యమిచ్చారు. మొత్తం 291 మంది అభ్యర్థులతో టీఎంసీ తొలి జాబితాను విడుదల చేసింది.

ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం మమతా బెనర్జీ నియోజకవర్గం. ఆమె తన కంచుకోట అయిన భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. అయితే, బీజేపీ కూడా దీదీని ఆమె సొంత నియోజకవర్గంలోనే కట్టడి చేయాలనే వ్యూహంతో, అక్కడ సువేందు అధికారిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అలాగే ఆయన నందిగ్రామ్ నుంచి కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో బెంగాల్ రాజకీయాల్లో భవానీపూర్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది.

ఇక, టీఎంసీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. ఇందులో 50 మంది మహిళలు, 79 మంది షెడ్యూల్డ్ కులాల (SC), 17 మంది షెడ్యూల్డ్ తెగల (ST), 42 మంది ముస్లిం అభ్యర్థులకు చోటు కల్పించారు. మరోవైపు, టికెట్లు దక్కని పలువురు నేతలు బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొందరు బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తుండటంతో బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.  

Mamata Banerjee
West Bengal Elections
TMC
Suvendu Adhikari
Nandigram
Bengal Politics
TMC Candidates List
Indian Elections
Political News
Trinamool Congress

More Telugu News